విశాఖ ఉక్కుకు భద్రత పెంపు: కాలేజీలకు బెదిరింపులు
విశాఖపట్నం/హైదరాబాద్: తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి భద్రతను పెంచారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ముప్పు ఉందనే ప్రచారం నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఉద్యోగులను కూడా తనిఖీ చేసే లోపలికి అనుమతిస్తున్నారు. ఉద్యోగుల గుర్తింపు కార్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని కీలకమైన విభాగాలను క్షుణ్నంగా పరిశీలించారు.
ఇదిలావుంటే, హైదరాబాద్ సమీపంలోని రెండు ప్రైవేట్ కళాశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ సమీపంలోని చందానగర్లో గల శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో బాంబు స్క్వాడ్స్ క్షుణ్నంగా పరిశీలించి బాంబు బెదిరింపులు ఉత్తుత్తివేనని తేల్చారు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శ్రీను బాంబు పేలి గాయపడిన సుప్రజా లాడ్జికి ఈ కాలేజీలు దగ్గరగా ఉండడంతో ఆందోళన పెరిగింది.