ఇంటి దారిపై రగడ: రోడ్డు మీదే మైసురారెడ్డి స్నానం
హైదరాబాద్: తన ఇంటికి దారి మూసేసారంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి ఇంటి రోడ్డుపైనే స్నానం చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటికి హైదరాబాద్ నగర పాలక సంస్థ (యంసిహెచ్) అధికారులు దారి మూసేశారని ఆయన ఆరోపిస్తున్నారు. తన ఆస్తంతా రోడ్డు విస్తరణకు ఇచ్చేసి తాను రోడ్డు మీద పడాలా అని మైసురా రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
అధికారులు తప్పు చేస్తే నాయకులకు ఏమైనట్లు ఆయన అడిగారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన ఇంటికి దారి మూసేశారని ఆయన ఆరోపించారు. తన ఇంటిలోకి తానే దొంగలా ప్రవేశించాలా అని ఆయన ప్రశ్నించారు. మైసురారెడ్డి ఇంటికి దారిని మూసేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.
రోడ్డు విస్తరణపై మైసురారెడ్డి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ రాద్ధాంతమంతా చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దారికి అడ్డంగా ఉన్న రేకును తొలగిస్తే సరిపోయేదని ఆయన అన్నారు.