రూ. వేయి కోట్ల భూముల స్వాహా: మైసురా
హైదరాబాద్: ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ వేయి కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అస్మదీయులకు కట్టబెట్టారని తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ (యంసిహెచ్) అధికారులు తన ఇంటికి దారి మూసేశారంటూ రోడ్డు మీదే కాపురం పెట్టిన మైసురారెడ్డి సోమవారం నాడు కూడా రోడ్డు అన్ని కార్యకలాపాలు నిర్వహించారు. అయితే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి సూచనతో ఆయన తన నిరసనను విరమించుకున్నారు.
ప్రభుత్వ భూములను అస్మదీయులకు కట్టబెట్టడానికి 180 ఉత్తర్వులు జారీ చేశారని, ఈ విషయంలో ఒక ప్రముఖ వ్యక్తి కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసుసని, తాను చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఆ వ్యక్తి కనుసన్నల్లోనే ఐఎయస్, ఐపియస్ అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులందరూ ఉన్నారని, ఆ వ్యక్తి లంచాలు వచ్చే ఫైళ్లను మాత్రమే చూస్తారని, ఫైళ్లపై ఆ వ్యక్తి సంతకాలు చేయరని ఆయన అన్నారు. తనకు నచ్చిన మాటలు మాత్రమే వింటారని, నచ్చకపోతే నడుం నొస్తుందని పక్కకు జారుకుంటారని ఆయన అన్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ఆ వ్యక్తి గుప్పిట్లోనే ఉందని, ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ రాజకీయాలను ఆ వ్యక్తే నడుపుతారని ఆయన అన్నారు. ఆ వ్యక్తి గాది కింద పందికొక్కు అని, రాష్ట్ర సంపదనంతా దోచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.