ఈ స్వాగతం ఎంతో గౌరవప్రదమైంది: జార్జి బుష్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్కు గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్ వద్ద జార్జి బుష్కు రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి గురుశరన్ కౌర్లతో పాటు హార్దిక స్వాగతం పలికారు. బుష్ రక్షణదళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ స్వాగతం కార్యక్రమానికి మంత్రులు శివరాజ్ పాటిల్, పి. చిదంబరం, కమల్నాథ్, ఇ. అహ్మద్, ఆనంద్శర్మ, షెల్జా కుమారి, జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె. నారాయణన్, జనరల్ జె.జె సింగ్, తదితరులు హాజరయ్యారు.
తాను ప్రపంచంలోని ఎన్నో దేశాల రాజధానులను చూశానని, ఇంత గొప్పగా, పద్ధతిగా, ఘనంగా జరిగిన స్వాగతం ఎక్కడా చూడలేదని బుష్ మీడియా ప్రతినిధులతో అన్నారు. గుర్రాల వాడకం స్వాగతోత్సవానికి అదనపు ఆకర్షణ అని, ఇక్కడికి తనకెంతో గౌరవప్రదమైన విషయమని ఆయన అన్నారు. ఈ పర్యటన కోసం తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని, అత్యంత ప్రధానమైన సంబంధాల కోసం రాష్ట్రపతి, ప్రధానులతో కలిసి పనిచేయడానికి చూస్తున్నానని ఆయన అన్నారు. బుష్తో పాటు ఆయన సతీమణి లారా బుష్ కూడా వచ్చారు. అనంతరం బుష్ దంపతులు రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. యమునా నది ఒడ్డుపై బుష్ దంపతులు ప్రార్థనలు చేశారు.