ఫైళ్లు మంత్రి వద్ద వుంటాయి, చూడవచ్చు: వైయస్
హైదరాబాద్: కావాలంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లు చూపుతామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఫైళ్లు చూపుతాం గానీ స్పీకర్ ముందు ఉంచకూడదని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై జరిగిన సుదీర్ఘ చర్చకు ఆయన మంగళవారం సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. తాము పారదర్శకంగా ఉన్నామని ఆయన చెప్పారు. పట్టణ గరిష్ట భూపరిమితి చట్టం అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ న్యాయవిచారణకు ఆదేశించాలని కోరితే తాము అంగీకరించామని ఆయన చెప్పారు.
వోక్స్ వ్యాగన్పై ఆరోపణలు వస్తే తాము సిబిఐ విచారణకు అప్పగించామని, పరిటాల రవి హత్య కేసులో మంత్రి జెసి దివాకర్ రెడ్డికి, తన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం ఉందని ఆరోపిస్తే సిబిఐకి అప్పగించామని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన తొమ్మిదిన్నర ఏళ్లలో ఒక్క విచారణకైనా అంగీకరించారా అని ఆయన అడిగారు. చంద్రబాబునాయుడు విచారణలను అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నకిలీ పత్రాలను చూపుతోందని ఆయన విమర్శించారు. చంద్రబాబునాయుడు మాటలన్నీ అబద్ధాలేనని ఆయన వ్యాఖ్యానించారు.
తమ వద్ద ఫైళ్లు రహస్యం కాదని ఆయన అన్నారు. వారి వద్దనే ఫైళ్లు ఉన్నాయని చెప్పినప్పుడు అవి రహస్యం ఎలా అవుతాయని ఆయన అడిగారు. ఫైళ్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వద్ద వుంటాయని, రేపటి నుంచి వాటిని ఎవరైనా చూడవచ్చునని ఆయన చెప్పారు. స్పీకర్ను తెలుగుదేశం సభ్యులు అవమానించారని, అందువల్ల ఫైళ్లను స్పీకర్ వద్ద పెట్టదలుచుకోలేదని, అవసరమైతే స్పీకర్కు సీల్డ్ కవర్లో ఫైళ్లను పంపుతామని ఆయన చెప్పారు. తెలుగుదేశం చూపుతున్న పత్రాలు ఫోర్జరీ అని నిరూపించడానికైనా తాము ఫైళ్లు చూదలుచుకున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వెం ఫైళ్లను చూపడానికి సిద్దమైసందున సమస్య పరిష్కామైందని స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి చెప్పారు. అయితే తెలుగుదేశం సభ్యులు అందుకు అంగీకరించలేదు. స్పీకర్ ముందే ఫైళ్లను ఉంచాలని వారు పట్టుబట్టారు.