మైండ్సెట్ మారాలి: జైపాల్ రెడ్డి మాట
హైదరాబాద్: పాలకుల, ప్రజల మైండ్సెట్లో మార్పు రావాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. శుక్రవారం ఫిక్కి నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. నగరాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో గ్రామీణాభివృద్ధి ముఖ్యంగా ఉండేదని, అయితే మన జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయని, పట్టణాభివద్ధి ప్రధానమైందని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రజల దృక్పథాల్లో, ఆలోచనల్లో మార్పు రావాలని ఆయన అన్నారు.
పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టం అమలులో మనం సఫలం కాలేకపోయామని, ఈ చట్టం అమలులో విఫలమయ్యామని ఆయన అన్నారు. పట్టణాలు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చెందడానికి ఈ చట్టం ఆటంకంగా మారిందని, మార్కెట్లో హేతుబద్ధత కూడా లేకుండాపోయిందని ఆయన అన్నారు. ఇది కేంద్ర చట్టమని, దేశంలోని అన్ని రాష్ట్రాలు దాని అమలు స్వస్తి చెప్పాయని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.