తేల్చుకుందాం: కాంగ్రెస్కు టిడిపి సవాల్
హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎవరికి 51 శాతం సీట్లు వస్తాయో తేల్చుకుందామని తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ను సవాల్ చేసింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటనకు స్పందిస్తూ తెలుగుదేశం ఈ సవాల్ విసిరింది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధక్షత్యన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం నాలుగు గంటల పాటు జరిగింది. సమావేశానంతరం పార్టీ నాయకులు టి. దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, కె. ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ విధానాలపై ప్రముఖంగా ఈ సమావేశంలో చర్చించినట్లు వారు తెలిపారు. పార్టీ విధానాల్లో, కీలక రంగాల్లో తమ వైఖరిని మార్చుకోనున్నట్లు వారు తెలిపారు.
నిత్యావసర సరుకుల ధరలను, చికన్గన్యా జ్వరాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. ఈ సమస్యలపై సిపియంతో కలిసి ఉద్యమాలను కొనసాగించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. చికన్గన్యా జ్వరాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తేవడానికి తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాని మన్మోహన్ సింగ్కు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖలు రాస్తారని వారు చెప్పారు. ఈ సమస్యలపై ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ఒక వినతిపత్రం సమర్పిస్తామని వారు చెప్పారు. పార్టీని బలహీనవర్గాలకు, రైతులకు సన్నిహితంగా తీసుకునిపోవడానికి వచ్చే నెల 6వ తేదీ నుంచి ఒక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు తెలిపారు.