ఉత్తరాంధ్రకు జలగండం: ఇద్దరు మృతి
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలోని నాగావళి, వంశధార నదులు పొంగిపొర్లుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు వరద ముప్పు పొంచి వుంది. జిల్లా అంతటా గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నాగావళి నది పొంగిపొర్లుతుండడంతో కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వంశధార నది పొంగిపొర్లుతుండడం వల్ల నర్సన్నపేట మండలంలోని ఏడు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. విజయనగరం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలకు కూడా ముప్పు పొంచి వుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జనజీవన స్తంభించింది. శ్రీకాకుళం జిల్లాలోని వాగులు వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదల వల్ల ఇద్దరు వ్యక్తులు మతి చెందారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల విశాఖపట్నం డాబా గార్డెన్లోని నాలుగు అంతస్థుల భవనం కూలిపోయింది. మరమ్మత్తులు జరుగుతుండడంతో ఈ భవనంలో ఎవరూ ఉండడం లేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావాల్సిన డక్కన్ ఎయిర్ విమానాన్ని విజయవాడలో ఆపేశారు. రాజమండ్రి జలమయమైంది. విశాఖపట్నం వద్ద గల మాచ్కండ్ జలవిద్యుత్కేంద్రం వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార పరిసరాల్లోని ఆరు మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయనగరం జిల్లాలో ప్రవాహంలో బస్సు బోల్తా పడింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. విజయనగరం జిల్లాలో చెరువులకు, కుంటలకు గండ్లు పడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీకాకుళం జిల్లా మొత్తం నీట మునిగే ప్రమాదం ఉంది.
విశాఖపట్నం విమానాశ్రయంపై వరద నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలు రద్దయ్యాయి. అయితే విమానాశ్రయానికి వరద ముప్పు లేదని ఎయిర్స్ఫోర్స్ అథారిటీ అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం నగరంలోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యాయి. ఈ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం జిల్లాలోని బుర్రా రైల్వే స్టేషన్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుపీడనం వల్ల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఒరిస్సాలోని పూరి వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది.












Click it and Unblock the Notifications