ఆదిలాబాద్ జిల్లానూ తాకిన వరద ముప్పు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ జిల్లాలోని పెన్గంగ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. వంతెనపై నాలుగు అడుగుల మేర వరద నీరు చేరి వుంది. దీంతో ఈ దారిలో రాకపోకలు స్తంభించాయి. పెన్గంగకు ఇంత పెద్ద యెత్తున వరద రావడం 1962 తర్వాత ఇదే మొదటిసారి. జిల్లాలోని వార్ధానది ఉప్పొంగుతోంది. 55 అడుగుల ఎత్తున్న వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో రాజులా వంతెనపై నాలుగు అడుగుల మేర నీరు చేరింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలంలోని 8 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని ఏడో నెంబరు జాతీయ రహదారిపై పెద్ద యెత్తున నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. నాగపూర్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై కూడా వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆదిలాబాద్ జిల్లాలోని పెండలవాడ, సంఘ్వీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిర్యాణిని వరదలు ముంచెత్తాయి. దీంతో బాహ్య ప్రపచంచంతో సంబంధాలు తెగిపోయాయి.