చిత్తూరు జిల్లా ప్రజలకు పవన్ కళ్యాణ్ తీపికబురు.. రూ.2,370కోట్లతో చిత్తూరు మల్టీ విలేజ్ స్కీమ్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా నిర్మాణాత్మకంగా పని చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల ప్రగతి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించటం మాత్రమే కాకుండా, తాగునీటి సమస్య ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చిత్తూరు మల్టీ విలేజ్ స్కీమ్ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్ గడువును 2028 వరకు పొడిగించి, రాష్ట్రవ్యాప్తంగా రూ.26,000 కోట్ల విలువైన తాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. అందులో భాగంగా చిత్తూరు మల్టీ విలేజ్ స్కీమ్ పురోగతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా సమీక్ష నిర్వహించి కీలక దిశానిర్దేశం చేశారు.

జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకాల కింద రూ.2,370కోట్ల అంచనా వ్యయంతో అమలవుతున్న 'చిత్తూరు మల్టీ విలేజ్ స్కీమ్' పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకుండా చూడాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఏడాది చివరి నాటికి నిర్దేశించిన లక్ష్యాలను నెలవారీ, వారాల వారీగా విభజించుకుని నిరంతరం సమీక్షించాలని అన్నారు. దీనివల్ల పనుల్లో వేగం పెరిగి, ప్రజలకు సకాలంలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల నుంచి అనుమతులు పొందే విషయంలోనూ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాల్లోని 3,163 ఆవాసాలకు తాగునీరు అందించనున్నారు.
సుమారు 25 లక్షల మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. గండికోట, వెలిగల్లు జలాశయాలను నీటి వనరులుగా ఉపయోగిస్తూ పనులు జరుగుతున్నాయి. గండికోట వద్ద ఇంటేక్ వెల్ నిర్మాణం, నాలుగు రా వాటర్ సంపుల్లో మూడింటి పనులు వేగంగా సాగుతున్నాయి. గుర్రంకొండ వద్ద 75 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రం, వెలిగల్లు వద్ద 26 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో మరో శుద్ధికేంద్రం నిర్మాణంలో ఉన్నాయి.
ఇప్పటివరకు సుమారు 130 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తయింది. ఏడు నీటి సంపులు, ఐదు ఓవర్హెడ్ ట్యాంకులు, 14 గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. నాణ్యతా లోపాలు లేకుండా పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను హెచ్చరించారు. త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలని ఆదేశించారు.













Click it and Unblock the Notifications
