అఫ్జల్కు క్షమాభిక్ష కోసం భార్య పిటిషన్
న్యూఢిల్లీ: తన భర్తకు క్షమాభిక్ష పెట్టాలని అఫ్జల్ గురు భార్య టాబుసమ్ గురు రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ను కోరింది. 2001లో పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడింది. అతడ్ని ఈ నెల 20వ తేదీన ఉరి తీయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అఫ్జల్ భార్య క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించింది. టాబుసమ్తో పాటు ఆమె ఏడేళ్ల కుమారుడు గాలిబ్ ఈ పిటిషన్ పెట్టుకున్నారు.
వారిద్దరితో పాటు అఫ్జల్ గురు తల్లి అయేషా బేగం, సోదరుడు హిలాల్ అహ్మద్ గురు, మామ గులామ్ మొహమ్మద్ శ్రీనగర్ నుంచి సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. తిహార్ జైలులో ఉన్న అఫ్జల్ను కూడా వారు రేపు కలుసుకుంటారు. మెర్సీ పిటిషన్ వారు తీహార్ జైలు సూపరింటిండెంట్కు సమర్పిస్తారు. దాన్ని ఆయన రాష్ట్రపతికి పంపిస్తారు. నర్సుగా పని చేస్తున్న అఫ్జల్ భార్య టాబూసమ్ తన భర్త అమాయకుడని, కావాలని కొందరు తన భర్తను ఈ కేసులో ఇరికించారని అంటోంది.