బాధితులపై వైయస్ కపట ప్రేమ: చంద్రబాబు
గుంటూరు: వరద బాధితులపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఆయన మంగళవారంనాడు గుంటూరు జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకు సహాయం అందించడం కన్నా ముఖ్యమంత్రి విందులకు, వివాహాలకు హాజరు కావడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ముంబాయిలో ఒక వివాహానికి వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
విందులకు, వివాహాలకు హాజరు కావడానికి ఇది సమయమా అని ఆయన ప్రశ్నించారు. ఇతర జిల్లాల్లో పర్యటనను మానుకొని వరద తాకిడి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించాల్సి వుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి బాధితుల పరామర్శకు రాకపోవడం వల్ల సహాయ చర్యలు చేపట్టడంలో అధికారులకు దిశానిర్దేశం కొరవడిందని ఆయన అన్నారు. ఆపద సమయంలో ఆదుకోని ప్రభుత్వం ఉండి ఎందుకని ఆయన అడిగారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే తాము 35 వేల కుటుంబాలకు ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు.