ఢిల్లీలో దుకాణాల బంద్, పాఠశాలలకు సెలవు
న్యూఢిల్లీ: మళ్ళీ నివాస గృహాలలోని అక్రమ దుకాణాలకు సీళ్ళు వెయ్యాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వు అనంతరం వ్యాపారులు నేడు ఢిల్లీ బంద్కు పిలుపునిచ్చారు. మరోసారి ఢిల్లీ దిగ్బంధానికి సిద్ధమయారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలకు, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని పాఠశాలలకు రెండురోజుల సెలవు ప్రకటించారు. ఢిల్లీలో గ్రేటర్ కైలాష్, కరోల్బాగ్, మాలవీయనగర్, జనకపురి, లక్ష్మీనగర్లలో దుకాణాలబంద్ మొదలైంది. వికాస్మార్గ్, జైల్రోడ్డు, యూసుఫ్సరాయ్, లోనిరోడ్, కరోల్ బాగ్ నయివాలా చౌక్, మధుబన్ట్రాఫిక్ క్రాసింగ్ మార్గాలలో ర్యాలీలకు వ్యాపారులు సిద్దమవుతున్నారు.
కాగా, కోర్టుఉత్తర్వు అమలు చేయాలని సీలింగ్ వ్యవహారాలపై చర్చిస్తున్న మంత్రుల గ్రూప్ నిర్ణయించింది. దుకాణాల సీలింగ్పై కేబినెట్లో చర్చించాలని, అఖిలపక్షసమావేశం నిర్వహించాలని మంత్రులు నిర్ణయించారు. ఎప్పుడు సీలింగ్ పునః ప్రారంభించాలా అనే అంశంపై సుప్రీంకోర్టు మళ్ళీ నిర్ణయిస్తుంది. బంద్సందర్భంగా వ్యాపారుల ఆగ్రహం హింసకు దారితీసే ప్రమాదం ఉన్నందువల్ల పోలీసు బలగాలను పెద్దస్థాయిలో మోహరించారు. 25 కంపెనీల రాపిడ్ యాక్షన్ ఫోర్స్, బిఎస్ఎఫ్ దళాలతోపాటు, 25 కంపెనీల ఢిల్లీ పోలీసులు అన్ని ముఖ్యమైన మార్కెట్లలో కట్టుదిట్టమైన పహరా ఏర్పాటు చేశారు.