నా నిర్ణయాన్ని సోనియా అభినందించారు: కెకె
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే తన నిర్ణయాన్ని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభినందించినట్లు డాక్టర్ కె. కేశవరావు తెలిపారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన రాజీనామా లేఖను అధికారికంగా ఈ రోజు రాత్రి 9 గంటలకు సోనియాకు అందజేస్తానని ఆయన చెప్పారు. సోనియాతో భేటీ కోసం ఆయన మంగళవారం ఉదయం నుంచి వేచి చూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు సాయంత్రం నాలుగున్నర గంటలకు సోనియా సమయం ఇచ్చారు.
తాను నాటకాలు ఆడడం లేదని, తాను రాజీనామా విషయంలో కచ్చితమైన నిర్ణయమే తీసుకున్నానని ఆయన చెప్పారు. తన రాజీనామాను ఒక నాయకుడు డ్రామా అన్నాడని, తాను ఆ విషయాలపై మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. తన కుమారుడు వెంకట్ ఇంట్లో ప్రశాంత్ రెడ్డి మరణించిన సంఘటనపై ఆయన సోనియాకు వివరణ ఇచ్చారు. దీనిపై ఆమె ఏమీ మాట్లాడలేదని సమాచారం.