ప్రశాంత్ రెడ్డి కేసు: ఆస్పత్రిలో చేరిన ప్రీతి
హైదరాబాద్: కాంగ్రెసు నాయకుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ ఇంట్లో మరణించిన ప్రశాంత్ రెడ్డి భార్యనంటూ వచ్చిన ప్రీతి హైదరాబాదులోని ఒక అస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరినట్లు సమాచారం. ప్రశాంత్ రెడ్డిని ఆస్పత్రికి తెచ్చిన రోజు అక్కడ కనిపించిన ప్రీతి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు, అయితే తీవ్రమైన మానసికాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రీతి పేరు మీద వెంకట్, ప్రశాంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నారు.
తన తండ్రి కేశవరావు పిసిసి పదవికి రాజీనామా చేసినట్లు వార్త విన్న వెంకట్ తీవ్ర మానసికాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఆయనను పోలీసులు బంజారాహిల్స్ ఎసిపి కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. సోమవారంనాడు పోలీసులు ఆయనను ప్రశ్నించారు. మంగళవారంనాడు పోలీసులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఆయన తడబడినట్లు సమాచారం. బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించిన తర్వాత అతన్ని సిఐడి పోలీసులు ప్రశ్నిస్తారు.