ప్రశాంత్ మృతికి ఇద్దరు భార్యలే కారణం: వెంకట్
హైదరాబాద్: ప్రశాంత్ రెడ్డి ఆత్మహత్యకు ఇద్దరు భార్యలే కారణమని ప్రశాంత్ రెడ్డి హత్యకేసులో నిందితుడు, పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ చెప్పారు. ప్రశాంత్ రెడ్డికి ఇద్దరు భార్యలని, దానివల్ల ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత సమస్యలు తలెత్తాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిప్రెషనుతో ప్రశాంత్ రెడ్డి కాల్చుకుని మరణించాడని ఆయన చెప్పారు. నిజాలు దర్యాప్తులో తేలుతాయని ఆయన అన్నారు.
ప్రశాంత్ రెడ్డి తనకు ఆప్తమిత్రుడని, రోజూ తమ ఇంటికి వచ్చేవాడని, అందుకే ప్రశాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. ప్రశాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదని ఆయన అన్నారు. మీ ఇంట్లో మరణించాడు కదా అని అంటే దానికి తానేమి చేయగలనని ఆయన అన్నారు. మీపై ఆరోపణలు వస్తున్నాయి కదా అంటే అనుమానాలు ఉండవచ్చునని వెంకట్ అన్నారు. తానేమీ తప్పు చేయలేదని, తాను బయటపడతాననే నమ్మకం ఉందని ఆయన అన్నారు.