సమాల్ ఆరోపణలపై విచారణకు సిద్ధం: హోంమంత్రి
హైదరాబాద్: పైరవీలు చేసుకుని విజిలెన్స్ కమిషనర్ పదవి చేపట్టిన ఆర్ సి సమాల్ కు తనను విమర్శించే నైతిక అధికారం లేదని రాష్ట్ర హోం మంత్రి జానారెడ్డి అన్నారు. హోంమంత్రి, ముఖ్యమంత్రి పేషీల్లో అవినీతిపరులైన అధికారులున్నారని ఇటీవలే విడుదలై విజిలెన్స్ కమిషనర్ సమాల్ నిన్న తీవ్ర ఆరోపణలు చేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత అధికారులు చేసే ఆరోపణలకు విలువ ఉండదని జానారెడ్డి శనివారం స్పందించారు. సమాల్ మానసిక పరిస్ధితి బాగుండలేదేమోనన్న అనుమానాన్ని హోంమంత్రి వ్యక్తం చేశారు.
సమాల్ చేసిన ఆరోపణలపై విచారణకు తాను సిద్ధమని జానారెడ్డి అన్నారు. పాతికేళ్ళ రాజకీయ జీవితంలో తాను ఎటువంటి ఆరోపణలు ఎదుర్కోలేదని ఆయన చెప్పారు. సమాల్ తన పరిధులు దాటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాను నిన్న చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని సమాల్ శనివారం ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.