హైదరాబాదులోని అత్తగారింట్లో కాపురం: శ్రీజ
న్యూఢిల్లీ: హైదరాబాదులోని తన అత్తగారింట్లో కాపురం పెడ్తామని శిరీష్ భరద్వాజ్ ను ప్రేమ పెళ్లి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ చెప్పింది. భర్త శిరీష్ భరద్వాజ్ తో కలిసి ఆమె న్యూఢిల్లీలోని ఎపి భవన్ కు వచ్చింది. వారం లోగా తాము హైదరాబాదు వెళ్తామని, తమ అత్తగారింట్లో కాపురం పెడ్తామని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పింది. తనను క్షమించాలని ఆమె మరోసారి తండ్రి చిరంజీవిని కోరింది. తమ ఇంటి నుంచి ఏ విధమైన కాల్స్ రాలేదని, కాల్స్ కోసం ఎదురుచూస్తున్నామని ఆమె అన్నది. తాను తన ఇంట్లోవారితో మాట్లాడడానికి ప్రయత్నించానని, అక్కడి నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రాలేదని ఆమె చెప్పింది. తన ఇంట్లో వారందరూ మౌనం వహిస్తున్నారని, తాము ఏ తప్పూ చేయలేదని, వారు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె అన్నది.
తన అత్తగారింటివారితో మాట్లాడానని, తమను వారు ఆహ్వానించారని ఆమె చెప్పింది. తాము హైదరాబాదు వెళ్లి అత్తగారింట్లో ఉంటామని ఆమె చెప్పింది. ఎపి భవనులో శ్రీజ దంపతులు కలివిడిగా తిరిగారు. వారి వెంట కొంత మది మిత్రులున్నారు. శ్రీజ దంపతుల్లో ఆందోళన కాస్తా తగ్గినట్లు కనిపించారు. వారికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. చిరంజీవి ఆమోదించినా ఆమోదించకపోయినా వారంలోగా హైదరాబాదు వెళ్తాలని వారు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. రక్షణ కల్పించాలని కోరుతూ శ్రీజ దంపతులు పెట్టుకున్న పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. వారికి ఏ మేరకు భద్రత అవసరమనే విషయాన్ని ఢిల్లీ హైకోర్టు నిర్ణయిస్తుంది