బాబు సహా టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్
హైదరాబాద్: సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు తెలుగుదేశం సభ్యులను గురువారం శాసనసభ నుంచి ఒక రోజు పాటు అధ్యక్ష స్థానంలో ఉన్న ఉప సభాపతి కుతూహలమ్మ సస్పెండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమాధానాన్ని అడ్డుకున్నందుకు చంద్రబాబు సహా తెలుగుదేశం సభ్యులను ఆమె సస్పెండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించారు.
ముఖ్యమంత్రి సమాధానానికి తెలుగుదేశం సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. ఉప సభాపతి ఎంతగా సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం సభ్యులు ముఖ్యమంత్రి వివరణను అడ్డుకుంటున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకు తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేయక తప్పదని అంటూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం సభ్యుల సస్పెన్షన్ కు తీర్మానం ప్రతిపాదించారు. తీర్మానం ఆమోదం తర్వాత వారిని సస్పెండ్ చేస్తున్నట్లు కుతూహలమ్మ ప్రకటించారు.












Click it and Unblock the Notifications