కాంగ్రెస్ గ్రూవుల మధ్య బాహాబాహీ
నల్లగొండ: రాష్ట్ర మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి వర్గాలు సోమవారం ఘర్షణకు దిగాయి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. బాహాబాహీకి దిగారు. ఈ గొడవలో పురుషోత్తమ రెడ్డి పడిపోయారు. ఆలేరు శాసనసభా నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమైన పురుషోత్తమ రెడ్డికి పార్టీ టికెట్ ఎలా ఇస్తారని, పైగా పురుషోత్తమరెడ్డికి ఎఐసిసి షోకాజ్ నోటీసు ఇచ్చిందని మంత్రి దామోదర్ రెడ్డి అన్నారు. దీనికి పురుషోత్తమ రెడ్డి వర్గీయులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని ఒక వర్గాన్ని బయటకు పంపారు. దీన్ని నిరసిస్తూ పురుషోత్తమరెడ్డి వర్గీయులు నల్గొండ క్లాక్ టవర్ వద్ద రాస్తారోకోకు దిగారు. తనకు ఎఐసిసి షోకాజ్ నోటీసు ఇవ్వడంపై దామోదర్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారని పురుషోత్తమరెడ్డి అన్నారు. తలుచుకుంటే తానూ దాడులు చేయించగలనని, కానీ తత్వం అది కాదని ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గంలో తన అనుచరులున్నారని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications
