ఐటి భూములపై విపక్షాల వాకౌట్
హైదరాబాద్: ఐటి కంపెనీలకు భూముల కేటాయింపుల విషయంలో జరుగుతున్న వ్యవహారాలకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), మజ్లీస్, బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వం భూముల విక్రయం వ్యవహారంలో బ్రోకర్ గా మారిందని సిపిఎం శాసనసభా పక్షా నాయకుడు నోముల నర్సింహయ్య విమర్శించారు. ప్రభుత్వ భూములను కాపాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పడం సిగ్గు చేటని ఆయన అన్నారు. ఐటి కంపెనీలకు భూముల కేటాయింపు విషయంలో ప్రభుత్వ విధానానికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ భూములను అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ ప్రాంతంలో ఖర్చు చేయాలని, భూములు అమ్మి సంక్షేమ పథకాలకు డబ్బులు ఖర్చు చేయడం సరి కాదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెన రాజేందర్ అన్నారు. భూముల విక్రయం విషయంలో ప్రభుత్వ పద్ధతులకు నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
భూముల విక్రయం విషయంలో ప్రభుత్వ విధానానికి నిరసనగా, ఐటి కంపెనీలకు కేటాయించిన భూములను రియల్టర్లకు అమ్ముకుంటున్నందుకు నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు సిపిఐ శాసనభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి చెప్పారు. భూములు నిరర్థకం ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ భూములను ఇతరులకు కేటాయించడాన్ని నిరసిస్తూ తాము వాకౌట్ చేస్తున్నట్లు మజ్లీస్ శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు. తమ పక్కన నిలబడిన వామపక్షాలను ప్రభుత్వం వదులుకోవాల్సి వచ్చిందని, తాము మాత్రమే మిగిలామని, తాము కూడా దూరం కావాల్సిన పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన అన్నారు. సొంత ఇల్లు అమ్ముకుని తన వద్ద చాలా డబ్బు ఉందని ఒక వ్యక్తి అనుకున్నాడట, పేదల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెట్టే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని, ల్యాంకో ముఖ్యమా, వక్ఫ్ బోర్డు ముఖ్యమా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానానికి నిరసనగా తాను వాకౌట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
