మీరిస్తే సరైంది, మేమిస్తే తప్పా: వైయస్

ల్యాంకోకు ఇచ్చిన భూమి వక్ఫ్ బోర్డుదని తెలియదని, తెలియకనే 40 ఎకరాల వక్ఫ్ భూములను ల్యాంకోకు ఇచ్చామని ఆయన చెప్పారు. వక్ఫ్ ఆస్తులను డెవలప్ మెంట్ కు ఎలా ఇస్తారని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. హైదరాబాదులో పేదలకు నివాస స్థలాలు ఇవ్వరు గానీ వందలాది ఎకరాలు దారాదత్తం చేస్తారా అని ఆయన అడిగారు. నిరర్థర ఆస్తుల విక్రయంతో ప్రభుత్వ బడ్జెట్ కు 12 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. పరిశ్రమలకు భూములు కావాల్సి వచ్చినప్పుడు తగిన నష్టపరిహారం చెల్లించి భూములు స్వాధీనం చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. సింగూరు, నందిగ్రామ్ వంటి గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేవని ఆయన చెప్పారు. డెల్టా ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా భూ స్వాధీనంపై సమస్యలు వస్తున్నాయని ఆయన అన్నారు. వాటికి నష్టపరిహారం ఎక్కువ చెల్లించి భూములు స్వాధీనం చేసుకుంటున్నామని, బలహీనవర్గాల గృహ నిర్మాణాలకు భూములు సేకరించే విషయంలో ఆ పద్ధతి అవలంబిస్తున్నామని ఆయన చెప్పారు. నిరర్థక భూములను అమ్మి నిధులు సమీకరించుకోగలుగుతున్నాం కాబట్టే లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకోగలుగుతున్నామని ఆయన అన్నారు. వాటిలో 48 వేల కోట్లు అభివృద్ధికి ఖర్చు పెడుతున్నామని ఆయన చెప్పారు.
అలా చేస్తున్నాం కాబట్టే సాగు నీటి ప్రాజెక్టులపై ఇంత పెద్ద యెత్తున నిధులు ఖర్చు పెట్టగలుగుతున్నామని ఆయన అన్నారు. మసాజ్ సెంటర్లకు, బ్యూటీ పార్లర్లకు భూములు ఇస్తున్నారనే ప్రతిపక్షాల విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. పాత గాంధీ కళాశాల ఆవరణను హోటల్ కు ఇచ్చామని, దాన్ని మసాజ్ సెంటర్లకు ఇస్తున్నారని అనడం సరి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయాలని చస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వ హయంలో మొదలు పెట్టినవే తాము పూర్తి చేస్తున్నామని ఆయన అన్నారు. షంషాబాద్ విమానాశ్రయం తలపెట్టింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అయినా తాము అన్ని లాంఛనాలు పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేశామని ఆయన చెప్పారు. షంషాబాద్ విమానాశ్రయ నిర్మాణాన్ని మూడేళ్ల క్రితం తాము మొదలు పెట్టామని, చంద్రబాబు 9 ఏళ్లలో చేయని పనిని తాము చేశామని ఆయన అన్నారు. సెజ్ ల వల్ల విశేషంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఆయన చెప్పారు. నెల్లూరులో అపాచీలో ఆరు వేల మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి జరిగితేనే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, రాష్ట్రం అభివృద్ధి జరుతుందని, అందుకే సెజ్ లకు భూములు ఇస్తున్నామని, సెజ్ లకు వ్యవసాయ యోగ్యమైన భూమి ఇవ్వడంలేదని ఆయన చెప్పారు. ఇంత అభివృద్ధి ఎప్పుడూ జరగులేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
