చంద్రబాబుతో బాలయ్య భేటీ
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారంనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును కలుసుకున్నారు. చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. వచ్చే నెల 5వ తేదీన గుంటూరులో జరిగే యువగర్జన సదస్సుపై వారిద్దరు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ యువగర్జన సదస్సులో బాలకృష్ణతో పాటు నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న పాల్గొంటారు. ఈ సదస్సును మొదట ఈ నెల 24వ తేదీన నిర్వహించాలనుకున్నారు. అయితే తర్వాత తేదీ మార్చుకున్నారు.
కాగా, నందమూరి తారకరత్న, కళ్యాణ్ రామ్ ఇప్పటికే వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి బాలయ్యేనని అంటూ వీరి పర్యటనల సందర్భంగా అభిమానులు నినాదాలు చేస్తున్నారు. బాలకృష్ణ ముఖ్యమంత్రి కావాలని అభిమానులు కోరుకుంటున్నారని ఇటీవల కళ్యాణ్ రామ్ అన్నారు. చంద్రబాబు, బాలయ్య తనకు రెండు కళ్లు అని తారకరత్న ఆదివారం నెల్లూరు పర్యటనలో అన్నారు. నందమూరి హీరోలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అన్నారు.
పది లక్షల మంది యువగర్జనకు వస్తారని తాము అనుకున్నామని, అయితే అంతకన్నా ఎక్కువే వస్తారని బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు అంటున్నారు. యువగర్జనకు అన్ని వైపుల నుంచి విశేష స్పందన లభిస్తోందని వారు చెప్పారు. యువత ఎటు వైపు ఉన్నారనేది ఈ సదస్సు ద్వారా తేలిపోతుందని వారన్నారు.












Click it and Unblock the Notifications
