మహా సిఎంగా షిండే పేరు ముందుకు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావు దేశ్ ముఖ్ వారసుడిగా కేంద్ర ఇంధన శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పేరు సోమవారం ప్రముఖంగా ముందుకు వచ్చింది. ముంబయి దాడులకు బాధ్యత వహిస్తూ విలాస రావు దేశ్ ముఖ్ ను తప్పించి ఆయన స్థానంలో మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నిర్ణయానికి వచ్చింది. కొత్త ముఖ్యమంత్రిని నియమించే విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ, చిదంబరం, అహ్మద్ పటేల్ లతో తన నివాసంలో చర్చించారు.
షిండే సోమవారం ఉదయం సోనియా గాంధీని కలుసుకున్నారు. తాను రాజీనామా చేసినట్లు విలాస్ రావ్ దేశ్ ముఖ్ ప్రకటించిన వెంటనే షిండే సోనియాతో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. షిండే పేరుతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేరు మొదటి నుంచి వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై మాట్లాడడానికి షిండే నిరాకరిస్తున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపి వల్లనే సుశీల్ కుమార్ షిండే పేరు ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు.
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఉందని, తాము తమ సంకీర్ణ భాగస్వామ్య పక్షాలను సంప్రదించాల్సి ఉందని, సంప్రదింపులు జరుగుతున్నాయని, ఈ స్థితిలో తానేమీ చెప్పలేనని, ఈ సాయంత్రం గానీ, రేపు గానీ ఏమైనా చెప్పగలనని సోనియా గాంధీతో సమావేశానంతరం ఆంటోనీ విలేకరులతో అన్నారు. కాగా, ఉప ముఖ్యమంత్రిగా ఆర్ఆర్ పాటిల్ స్థానంలో ఛగన్ బుజభల్ ను ఎన్సీపి ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎన్సీపి శాసనసభా పక్ష సమావేశం మంగళవారం జరుగుతుంది.