ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: హైదరాబాదులో గుడి కూల్చివేతకు బాధ్యులను చేస్తూ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాదు నగర పాలక సంస్థ టౌనింగ్ ప్లానింగ్ డిప్యూటీ కమీషనర్ మధుసూదన రావును, అసిస్టెంట్ ప్లానర్ దేశ్ పాండేను ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది. రోడ్డు విస్తరణలో భాగంగా హైదరాబాదులోని కోఠీ ప్రాంతంలో గుడిని కూల్చివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. వెంటనే మంత్రి ముఖేష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖేష్ తో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. గుడిని తిరిగి నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్, జిహెచ్ ఎంసి కమీషనరులతో సమావేశమయ్యారు.
చిన్న సంఘటనను భారతీయ జనతా పార్టీ (బిజెపి) పట్టు కోసం రాజకీయం చేస్తోందని ముఖేష్ విమర్శించారు. గుడిని కూల్చే ఉద్దేశం అధికారులకు లేదని, బస్సులు తిరగడానికి గోడను కూల్చే క్రమంలో అనుకోకుండా గుడి కొంత నష్టపోయిందని ఆయన చెప్పారు. గుడిని తిరిగి నిర్మిస్తామని ఆయన చెప్పారు. మంత్రి హామీ ఇచ్చినా విశ్వహిందూ పరిషత్, భజరంగ దళ్ వినిపించుకోలేదు. ప్రభుత్వం కావాలనే గుడిని కూలగొట్టించిందని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. కోట్లాది హిందువుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బ తీసిందని ఆయన అన్నారు.