25 వేల ఎకరాల అసైన్డ్ భూముల స్వాధీనానికి రంగం సిద్ధం చేసిన తెలంగాణా ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ ప్రాజెక్టుల అమలు కోసం సాగులో లేని అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 25 వేల ఎకరాల అసైన్డ్ భూములను దశలవారీగా సేకరించి, వాటిని ప్రజల అభివృద్ధికి వినియోగించనుంది.
హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఉన్న అసైన్డ్ భూములపై దృష్టి
ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కొంత భూమి స్వాధీనం చేసుకుని పనులు మొదలు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఉన్న అసైన్డ్ భూములపై దృష్టి సారించారు. ఇప్పటికే సుమారు 5 వేల ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో దాదాపు 3 వేల ఎకరాలను తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి అప్పగించారు.

టీఎస్ఐఐసీకి భూములు అప్పగిస్తున్న ప్రభుత్వం
టీఎస్ఐఐసీ మొత్తం 10 వేల ఎకరాల భూమి కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఎంకేపల్లి, పెద్దమంగళారం, సీతారాంపురం, దామరపల్లి, పెద్దవీడు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారు.ఈ భూములను పారిశ్రామిక పార్కులు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, రైల్వే శాఖ మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. రాష్ట్రంలో భూమిలేని పేద రైతులకు సాగు కోసం గతంలో 1.40 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కేటాయించారు.
సుమారు 3 వేల ఎకరాలు అక్రమంగా విక్రయించినట్టు గుర్తింపు
హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో ఉన్న 25 వేల ఎకరాలు వ్యవసాయం కోసం ఉపయోగించకుండా ఖాళీగా ఉండటం గమనించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అసైన్డ్ భూములను అక్రమంగా విక్రయించడం చట్టపరంగా నిషేధం. 1977 ల్యాండ్ ట్రాన్స్ఫర్ నిషేధ చట్టం ప్రకారం అక్రమ లావాదేవీలు జరిగితే భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికే సుమారు 3 వేల ఎకరాలు అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు.
భూమి అప్పగించే లబ్ధిదారులకు, ఆక్రమణ చేసి ఉంటున్నవారికి ప్లాట్లు
తుక్కుగూడ, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం వంటి ప్రాంతాల్లో నోటీసులు జారీ చేసి భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. భూమి అప్పగించే లబ్ధిదారులకు ప్రతి ఎకరానికి సుమారు 800 చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వనున్నారు. ఆక్రమణదారులకు కూడా 300 చదరపు గజాల ప్లాట్లు అందించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి వేగం పుంజుకుని, ఉపాధి అవకాశాలు పెరిగి, మౌలిక సదుపాయాలు మెరుగుపడే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications