ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం..! ఆ రహస్యం దాచినందుకు..!
భారత్-పాకిస్తాన్ (India-Pakistan) అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి పహల్గాం దాడులో, సరిహద్దు తీవ్రవాదమో, లేదా నిత్యం చేసుకునే హెచ్చరికలో ఇవి మాత్రమే. కానీ అంతకు మించిన ఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఇద్దరు భారతీయులకు పాకిస్తాన్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భారత్ కు చెందిన ఆ ఇద్దరికి ఇంత గొప్ప పురస్కారం ప్రకటించడం వెనుక చరిత్రలో నిలిచిపోయే ఓ గొప్ప కారణం ఉంది. అదేంటో ఓసారి చూద్దాం..
భారత్-పాకిస్తాన్ విభజన జరుగుతున్న సమయంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఏర్పాటును బలంగా కోరుకున్న మొహమ్మద్ అలీ జిన్నాకు టీబీ సోకింది. ఆయనకు అప్పటికే భారత్ లో ఉండటంతో బొంబాయికి చెందిన ఇద్దరు పార్శీ వైద్యులు డాక్టర్ జల్ రతన్ జీ పటేల్, డాక్టర్ జల్ ధాయ్ భో కూ చికిత్స అందించారు. ఈ విషయం వారు గోప్యంగా ఉంచారు. అలాగే ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియనివ్వలేదు. దీని వెనుక కారణం వారి వృత్తిపరమైన గోప్యతే. జిన్నా కోరికపై వారు ఆయన అనారోగ్యాన్ని అప్పటి కాంగ్రెస్ పెద్దలకు గానీ, భారత్ జాతిపిత అయిన గాంధీకి గానీ ఈ విషయం తెలియనివ్వలేదు.

జిన్నా అనారోగ్యం పాలైన తర్వాత ఆయన ఎంతో కాలం బతకరని ఆ ఇద్దరు డాక్టర్లు తేల్చేశారు. కానీ విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదు. ఇదంతా తెలియకుండానే భారత్-పాక్ విభజన జరిగిపోయింది. ఆ తర్వాత విషయం తెలిసిన భారత చివరి వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ .. తనకు ఇది ముందే తెలిసి ఉంటే విభజన వాయిదా వేసే వాడినని కూడా చెప్పుకున్నారు. చివరికి విభజన జరిగిన ఏడాది తర్వాత జిన్నా చనిపోయారు. అలా తమ వృత్తి నిబద్ధతతో జిన్నా అనారోగ్యాన్ని దాచిపెట్టిన ఈ ఇద్దరు వైద్యులు డాక్టర్ జల్ రతన్ జీ పటేల్, డాక్టర్ జల్ ధాయ్ భో కూను పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు తమ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్ ఏ ఇంతియాజ్ అవార్డుతో గౌరవించాలని నిర్ణయించింది. అయితే వారిద్దరూ ఇప్పుడు బతికి లేరు. అయినా వారి గౌరవార్ధం మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు ఈ అవార్డు అందించబోతోంది. వచ్చే నెలలో ఈ అవార్డు వారి కుటుంబాలకు అందిస్తామని పాక్ మంత్రి అహసాన్ ఇక్బాల్ ప్రకటించారు.














Click it and Unblock the Notifications