సంక్షోభం వేళ భారత్ కు పుతిన్.. కీలక పరిణామం..
భారత్- రష్యా మధ్య బంధం దశాబ్దాలుగా పటిష్టంగా కొనసాగుతోంది. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 12-13 మధ్య న్యూఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వ కార్యాలయం క్రెమ్లిన్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఏడాది కాలంలో పుతిన్.. భారత్ కు రావడం ఇది రెండో సారి కావడం విశేషం. గతేడాది డిసెంబర్ లో జరిగిన 23వ భారత్- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ హాజరైన విషయం తెలిసిందే.
ఈ సారి బ్రిక్స్ సమావేశాలు భారత్ అధ్యక్షతన జరుగుతోంది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆధ్వర్యంలో ఈ ఉన్నతస్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సులో పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం కానున్నారు. అదే విధంగా.. ఈ ఏడాది చివర్లో వార్షిక సదస్సు కోసం ప్రధాని మోదీ కూడా రష్యా పర్యటనకు వెళ్లనున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ధ్రువీకరించారు.
ఇక ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన తరుణంలో ప్రపంచ వాణిజ్య వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో 60 నుంచి 65 శాతం వరకు చమురు హార్మూజ్ జలసంధి ద్వారానే భారత్ కు చేరుతుంది.

ఈ వాణిజ్య మార్గం మూసివేసిన నేపథ్యంలో భారత్ లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తింది. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ ముడి చమురు, ఎరువులు, కోకింగ్ కోల్ సరఫరాలను కొనసాగించడం అలాగే స్థానిక కరెన్సీలలో వ్యాపారాన్ని బలోపేతం చేయడంపై ఇరు దేశాలు ఈ సదస్సులో చర్చించే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇక భారత్- రష్యా మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత్, రష్యాల బంధాన్ని ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యంగా పిలుస్తారు.












Click it and Unblock the Notifications