రాష్ట్రమంతా ఎమ్మార్పీయస్ బంద్
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) సోమవారం బంద్ నిర్వహిస్తోంది. హైదరాబాదులో సోమవారం ఉదయం పెద్దగా బంద్ ప్రభావం లేకపోయినప్పటికీ జిల్లాల్లో ఆ ప్రభావం కనిపించింది. ఎమ్మార్పీయస్ కార్యకర్తలు డిపోల ముందు బైఠాయించి బస్సులను బయటకు రానీయలేదు.
విజయవాడలో ఎమ్మార్పీయస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆందోళనకారులు రెండు బస్సులను ధ్వంసం చేశారు. వరంగల్లు జిల్లాలో బంద్ ప్రభావం కనిపించింది. చాలా వరకు బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బంద్ ప్రభావం పాక్షికంగానే కనిపించలేదు. నల్లగొండ జిల్లాలో బంద్ ప్రభావం కనిపించింది. తిరుపతిలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రాస్తారోకోలు చేస్తున్నారు.
రాయలసీమ ప్రాంతాల్లో బంద్ ప్రభావం తక్కువగానే ఉంది. విద్యాసంస్థలు చాలా వరకు తెరిచే ఉన్నాయి. దుకాణాలు కూడా చాలా వరకు తెరిచారు. ఎమ్మార్పీయస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో బంద్ ప్రభావం తీవ్రంగా ఉండగా ఇతర ప్రాంతాల్లో పాక్షికంగానే ఉంది.