ఉద్రిక్తత.. విష్ణు అరెస్ట్
విజయవాడ: వంగవీటి రంగా 20 వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల కార్యకర్తల మధ్య విజయవాడలో శుక్రవారం ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. రంగా కుమారుడు, విజయవాడ ఎమ్మెల్యే రాధా ఇటీవల కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళడంతో స్ధానిక కాంగ్రెస్ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు మల్లాది విష్ణు అనుచరులు రంగా విగ్రహానికి కాంగ్రెస్ కండువాను కప్పి నివాళి ఘటించారు. రాధాకృష్ణ అనుచరులు ఆ కండువాను తొలగించి భీతావహ వాతావరణం కల్పించారు.దీంతో విష్ణు, ఆయన అనుచరులు తిరిగి రంగా విగ్రహం వద్దకు బయలుదేరటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎంత వారించినా వారు వినకపోవటంతో వారు విష్ణును అరెస్ట్ చేశారు.
ప్రజారాజ్యం కార్యకర్తల దాడికి నిరసనగా బంద్ పాటించాలంటూ బీసెంట్ రోడ్ లో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీభత్సం సృష్టించారు. సోడా బాటిళ్ళు పగులగొట్టారు. విజయవాడ రాజకీయాల్లో కంకిపాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూకు రాజశేఖరరెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అందుకు నిరసనగా వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ కు రాజీనామా చేసి చిరంజీవి పార్టీలో చేరిపోయారు.