ఇస్లామిక్ యూనివర్శిటీ పై బాంబు దాడి
గాజా: గాజా సిటీలోని హమాస్ల సాంస్కృతిక కేంద్రంగా పేరుగాంచిన ఇస్లామిక్ యూనివర్శిటీపై ఇజ్రాయెల్ సేనలు బాంబుదాడి చేశాయి. తాజాగా గత అర్థరాత్రి అనంతరం ఆరు సార్లు వైమానిక దళాలు దాడి చేసినట్లు ప్రత్యక్షసాక్షుల ద్వారా కధనం. హమాస్ల అత్యున్నతస్థాయి కమాండర్లు అంతా ఇక్కడే చదువుకున్నారు. హమాస్ల ప్రధాన విద్యాకేంద్రం ఇదే. అయితే మూడురోజులుగా కొనసాగుతున్న దాడులతో తమకూ ముప్పు ఉందని వూహించిన యూనివర్శిటీ వర్గాలు కొద్దిరోజులక్రితమే క్యాంపస్ను ఖాళీ చేశాయి.
ఆదివారం నాడు హమాస్లకు ఆహారం, ఆయుధాలు సరఫరా అయ్యే మార్గాలన్నిటిపై ఇజ్రాయెల్ బాంబుదాడులు చేసింది. దీంతో ఇప్పటివరకు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 300కు చేరింది. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. దీని తర్వాత నేలపై యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధం అవుతోంది. దీనికోసం 6,500 మంది సైనికులను సిద్ధంగా ఉంచింది. ఏ క్షణంలోనైనా వైమానిక దాడులు విరమించి అధిక నష్టం కలిగించే ముఖాముఖి పోరాటాలకు తాము సిద్ధమని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయంలో తప్పు హమాస్లదేనంటూ ఇజ్రాయెల్ను అమెరికా సమర్థించింది.