కడపు మండే మాట్లాడుతున్నా: పవన్
హైదరాబాద్: యువజన కాంగ్రెస్ వివాదం అనంతరం యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తనను జైల్లో పెట్టినా... కొట్టినా... కోర్టుకు తీసుకెళ్లి శిక్షలు విధించినా ప్రజల కోసం సత్యం మాట్లాడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తననేం చేసినా ప్రజల కోసం ఏమైనా మాట్లాడుతూనే ఉంటానని బల్లగుద్ది చెప్పారు. కాంగ్రెస్ నేతలపై తాను చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. వారిగురించి తాను కొత్తగా ఏమీ మాట్లాడలేదని, ఇదివరకే చాలామంది మాట్లాడిన విషయాలనే మళ్లీ చెప్పానని అన్నారు.
ముస్లింల కోసం ఏ ఒక్క నాయకుడు తనలా గట్టిగా మాట్లాడలేదన్నారు. తాను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందని ఏ ఒక్క ముస్లిం సోదరుణ్ని అడిగినా చెబుతారన్నారు. పాతబస్తీలో స్వయంగా తిరిగి వారి కష్టాలు తెలుసుకున్నానని, భీమ్రావ్బాడకు వెళ్లి బాలింతలు పడుతున్న అవస్థలు చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన ప్రతి మాట ప్రజల నోటినుంచి, వారి కడుపుమంట నుంచి వచ్చినవేనన్నారు.