బాబు..ఆల్ ఫ్రీ అనండి:శోభానాగిరెడ్డి
హైదరాబాద్ :వంద రూపాయలకు వంట సరుకు అంటూ ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రకటించిన పథకాన్ని చూసి.. అంతకంటే తక్కువకే తామూ ఇస్తామని.. తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని పీఆర్పీ అధికార ప్రతినిధి శోభా నాగిరెడ్డి అన్నారు. దానికంటే 'ఆల్ ఫ్రీ' అని ప్రకటించి ఉంటే బాగుండేదని ఆమె ఎద్దేవా చేశారు. అలాగే లారీ యజమానుల సమస్యల్ని పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. పెట్రోలు, డీజిలు ధరలు రవాణా ఆపరేటర్ల సమస్య మాత్రమే కాదని, ప్రజలందరి సమస్యగా పేర్కొన్నారు.
పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శోభ మాట్లాడారు. సత్యం కంపెనీ వ్యవహారాలు, మేటాస్కి అప్పగించిన ప్రాజెక్టులపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని శోభానాగిరెడ్డి డిమాండు చేశారు. నక్సలైట్ల సమస్యను సాంఘీక, ఆర్ధిక సమస్యగా ఇప్పుడు చెబుతున్న చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు బూటకపు ఎన్కౌంటర్లు చేశారని ఆరోపించారు. తనపై హత్యాయత్నం జరిగిందన్న కారణంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు.