కృష్ణా ప్రజారాజ్యంలో కమ్మ-కాపు చిచ్చు
విజయవాడ: కృష్ణా జిల్లా ప్రజారాజ్యం పార్టీ ముఖ్య నాయకుల మధ్య జరుగుతున్న ఘర్షణ ఆ పార్టీ పరువు తీసింది. ప్రముఖ ట్రావెల్స్ యజమాని కేసినేని నాని కొంతకాలం క్రితం ఎంతో ఆర్భాటంగా ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ విజయవాడ అర్బన్ కన్వీనర్ పదవిని పొందారు. ఆ తర్వాత విజయనిర్మలను కృష్ణాజిల్లా కన్వీనర్ గా నియమించారు. జిల్లా ఇన్ చార్జి ఆధ్వర్యంలో పనిచేయాల్సిన కేసినేని నాని రిపబ్లిక్ దినోత్సవంలో విజయనిర్మలను ధిక్కరించారు. ఆమెను ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులోని ఒక గదిలో నిర్మంధించి ఆమె భర్తపై నాని వర్గీయులు దాడి చేశారు. ఇటీవలే పార్టీలో చేరిన ఎమ్మెల్యే వంగవీటి రాధా కేసినేని వర్గీయుల మీద తిరగబడి, తన కులానికి చెందిన విజయనిర్మలకు మద్దతు పలికారు.
కృష్ణాజిల్లా ప్రజారాజ్యంలో కులాల కుంపటి రగులుకోవడంతో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసినేని నాని ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధం కాగా, ఆయనకు సర్ది చెప్పడానికి అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు. కృష్ణాజిల్లా ప్రజారాజ్యం పార్టీలో కమ్మ-కాపు వర్గాల మీద పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. మొదట అనుకున్నట్టు మాజీ ఎంపీ రెడ్డయ్య యాదవ్ కు జిల్లా కన్వీనర్ పదవి ఇచ్చి ఉంటే ఈ కులాల చిచ్చు వచ్చి ఉండేది కాదని జిల్లా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రెడ్డయ్యకు ప్రాధాన్యం లేని పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు.