'శ్రీరామ్ సేన' అధినేత అరెస్టు
మంగళూరు: శ్రీరామ్ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముథాలిక్ ను కర్ణాటక పోలీసులు మంగళవారం బెల్గాంలో అరెస్టు చేశారు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 153 కింద కేసు బుక్ చేసారు. అయితే మంగళూరు పబ్లో శనివారం రాత్రి మహిళలపై భౌతిక దాడుల సంఘటనకు సంబంధించి కాకుండా...గతంలో దావనగిరి జిల్లాలో మత ఘర్షణలు సృష్టించినందుకు అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. దావనగిరి కేసు చాలా కాలంగా పెండింగులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
అంతేగాక 'శ్రీరామ్ సేన' సంస్థ ఉపాధ్యక్షుడు ప్రసాద్ అట్టావర్ను, మరో 10 మంది కార్యకర్తలనూ అదుపులోకి తీసుకొన్నారు. మరో ప్రక్క వీహెచ్పీ మాజీ నాయకుడైన ప్రమోద్ను బెల్గాంలో అరెస్టు చేశారు. ఇక తాజా అరెస్టులతో కలిపి..శనివారం రాత్రి నాటి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకొన్న వారి సంఖ్య 32కు చేరింది.
''నేను క్షమాపణ కోరుతున్నా. మా కార్యకర్తలు చేసింది తప్పు'' అని అంతకుముందు ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఐతే తప్ప తాగి నగ్నంగా నృత్యాలు చేయడం, మాదక ద్రవ్యాలు వాడడం తప్పని, అలాంటి వాటినుండి మహిళలను రక్షించాలన్న ఉద్దేశంతోనే తాము దాడి జరిపామని, చిన్న సంఘటనను మీడియా భూతద్దంలో చూపుతోందని ప్రమోద్ తాజాగా ఓ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.