గోపాలస్వామిపై మంత్రి భరద్వాజ్ ధ్వజం
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం తన పరిధిలో తానుండాలని, పొలిటికల్ బాస్గా ప్రవర్తించటం సరికాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి హెచ్ఆర్ భరధ్వాజ్ సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ పరిధిలో ఉండే సంస్థ అని, రాష్ట్రపతికే దానిపై తుది అధికారం ఉంటుందని అన్నారు. ఎన్నికల అధికారుల్లో ఎవరి ప్రవర్తనపై అనుమానాలు ఉన్నా ప్రభుత్వం ఎన్నికలసంఘం నుంచి నివేదిక కోరుతుందని, దాని ప్రకారం రాష్ట్రపతి చర్యలు తీసుకుంటారని అన్నారు. తోటి ఎన్నికల అధికారిపై చర్యకు సిఫార్సు చేసే అధికారం ప్రధాన ఎన్నికల కమిషనర్ గోపాలస్వామికికు లేదని, ఈసీలో అందరూ సమానస్థాయి అధికారులేనని ఆయన స్పష్టం చేశారు. గోపాలస్వామి తరువాత ప్రధాన ఎన్నికల అధికారిగా నవీన్చావ్లానే ఉంటారని తెలిపారు.
నవీన్ చావ్లాను తొలగించాలని గోపాలస్వామి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు లేఖ రాయడం ఎన్నికల సంఘంలోని విభేదాలను తెలియజేస్తోంది. అది రాజకీయ వివాదానికి కూడా దారి తీసింది. నవీన్ చావ్లాను తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. గోపాలస్వామి రాసిన లేఖను ప్రతిభా పాటిల్ ప్రధాని మన్మోహన్ సింగ్ కు పంపించారు. ప్రభుత్వం ఆ లేఖకు రాష్ట్రపతికి సమాధాం ఇస్తుందని భరద్వాజ్ చెప్పారు. ఏమైనా ఉంటే మీడియా తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఇసి ఓటర్ల జాబితాను తయారు చేయాల్సిందే తప్ప విభేదాలను పరిష్కరించుకునే పని చేయకూడదని ఆయన అన్నారు.