మైటాస్ పనులు ఆగవు: సిఎం
హైదరాబాద్: మైటాస్ కంపెనీకి ఉన్న సామర్థ్యం మేరకే తాము అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆ సంస్థకు అప్పగించామని ఇప్పుడు అవన్నీ రద్దు చేస్తే ప్రాజెక్టులు ఆగిపోతాయని, నష్టపోయేది ప్రజలేనని సీఎం అన్నారు. సత్యం, మైటాస్ కంపెనీలపై శాసనసభలో జరిగిన చర్చకు ఆయన మంగళవారం సమాధానమిచ్చారు. మైటాస్తో తాము కుమ్మక్కు కాలేదని కేవలం ప్రాజెక్టులు ఆగకూడదనే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. నెల్లూరు పోర్టు పనులు మైటాస్కు ఇవ్వలేదని, మహారాష్ట్ర కంపెనీకి ఇచ్చామని అన్నారు. తెలిసీ తెలియకుండా ఆరోపణలు చేయటం తగదని అన్నారు.
కడపలో కూడా ప్రజలకు నీటి సౌకర్యం కల్పించేందుకు, త్వరగా పనులు జరిగేందుకు పెద్ద కంపెనీ అయిన, గతంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. సత్యం కంపెనీపై 2002లోనే ఓ దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేసిందని అయినా టీడీపీ హయాంలో కావాలనే ఆ నివేదికను తొక్కిపెట్టారని అన్నారు.
మెట్రో రైలు ప్రాజెక్టుపై తాము పారదర్శకంగా వ్యవహరించామని ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడూ ఒక్క రీతిలో ఉండదనే విషయంలో మాత్రమే శ్రీధరన్ తమతో విభేదించారని ఆయన అన్నారు. మేటాస్ కు ఇచ్చిన సాగనీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకాలు ఉండవని, తాము అందుకు సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని ఆయన చెప్పారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని ఆయన చంద్రబాబుకు హితవు చెప్పారు.












Click it and Unblock the Notifications