అసెంబ్లీ: జగన్ కంపెనీలపై దుమారం
తొలిసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. స్పీకర్ ప్రసంగంపై చర్చ, బడ్జెట్పై చర్చ సందర్భంగా విపక్షాలకు తగినంత సమయం దొరుకుతుందని, అనుకున్నది మాట్లాడవచ్చని, సమయమంతా విపక్షాలదేనని స్పీకర్ అన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అయినా వారు వినకపోవటంతో సభను రెండవసారి 15 నిముషాలపాటు స్పీకర్ వాయిదా వేశారు.
బుధవారం అసెంబ్లీ సమావేశం కాగాన్ వై.ఎస్ జగన్కు చెందిన 13 కంపెనీల అక్రమాలపై చర్చకు టీడీపీ, సీపీఐ, సీపీఎం, తెరాస వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. కల్లుగీత కార్మికులకు సంబంధించిన జీఓ 767 రద్దుపై భాజపా వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. స్పీకర్ వీటన్నిటిని తిరస్కరించి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీంతో ప్రతిపక్షాల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ లేచి నిలుచున్నారు. తాము లేవనెత్తే అంశాలపై చర్చ జరగాలని పట్టుబట్టారు. జగన్ కంపెనీలపై న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆఖరు, రేపు లాంఛనసభే కనుక గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనీయాలని, ముందు ప్రశ్నోత్తరాలు జరగనీయాలని స్పీకర్ కోరారు. ఆయన పదేపదే విజ్ఞప్తి చేసినా విపక్షాలు పట్టువీడకపోవటంతో స్పీకర్ సభను 15 నిముషాలు వాయిదావేశారు. రెండవ సారి వాయిదా అనంతరం ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది.