ఇంక శెలవు..సోమనాధ్ చటర్జీ

"బాధాకరమే అయినా సభ్యుల దుష్ప్రవర్తనపై కొన్ని కమిటీలు వేశా. 2008 జులైలో లోక్సభలో విశ్వాస పరీక్ష సందర్భంగా సభ్యులు నోట్లకట్టలను ప్రదర్శించిన నేపథ్యంలో ముడుపుల ఆరోపణలపై కమిటీ వేశాం" పార్లమెంటు సభాపతి సోమ్నాథ్ ఛటర్జీ అన్నారు. "ఇవన్నీ సభ్యుల దోషాల నుంచి సభ తనను తాను ప్రక్షాళన చేసుకొనే కార్యక్రమంలో భాగంగా అసమాన చిత్తశుద్థితో తీసుకున్న నిర్ణయం" అని ఆయన చెప్పారు.
తెలుగుదేశం సభాపక్షనేత ఎర్రన్నాయుడు...చివరి అనుబంధ ప్రశ్న అడిగే అవకాశం తనకే ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. "నీకు వచ్చే లోక్సభలో తొలి అనుబంధ ప్రశ్న అడిగే అవకాశం లభించుగాక! ఇప్పుడు నామీద కోపం పోయిందనుకుంటా" అని స్పీకర్ బదులిచ్చారు. "మీరు మళ్లీ పోటీ చేయాలి. మిమ్మల్ని ప్రశ్న అడిగే అవకాశం రావాలి" అని ఎర్రన్నాయుడు కోరారు. దానికి సోమ్నాథ్..."అందుకు నేను నా వ్యకిత్వాన్ని మార్చుకోవాలి" అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు నిజమైన సాధికారత లభించేదన్నారు. తాను పక్షపాతంతో వ్యవహరించానని గతంలో భాజపా చేసిన ఆరోపణలను గుర్తుచేసుకుంటూ, "విధి నిర్వహణలో భాగంగా నాకు చేతనైనంత మేర సభా హక్కులు, గౌరవం కాపాడటానికి ప్రయత్నించా. పార్లమెంటరీ వ్యవస్థ సమర్థంగా పని చేయాలన్న ఆకాంక్షే తప్ప అందులో ఎలాంటి పార్టీ పక్షపాతం లేదు" అన్నారు.
దిగజారుతున్న పార్లమెంటు విలువను కాపాడేందుకు 11 మంది సభ్యుల తొలగింపు వంటి అసాధారణ నిర్ణయాలు తీసుకున్న సభాపతి సోమ్నాథ్ ఛటర్జీ కూడా తన సుదీర్ఘ రాజకీయ, పార్లమెంటరీ జీవితానికి గురువారంతో వీడ్కోలు పలికారు. తాను సభ్యులతో 'హెడ్ మాస్టర్'లా ప్రవర్తించడంలో తప్పులేదని సమర్థించుకున్నారు. చెమర్చిన కళ్లతో లోక్సభ ప్రస్తుత సభ్యులకు, కొత్తగా వచ్చే సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications