కాచిగూడలో భారీ చోరీ
హైదరాబాద్:కాచిగూడలోని నగల దుకాణంలో దొంగలు పడ్డారు. కోటిన్నర రూపాయల విలువైన ఏడు కిలోల బంగారు నగలు, 35 కిలోల వెండి ఆభరణాలు, క్యాష్ కౌంటర్లోని 45వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. షో కేసుల్లో మూడు కిలోల నగలను మాత్రం ముట్టుకోలేదు. ఇది తెలిసిన వాళ్ల పనే అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన చోరీ వివరాలు ఇలా ఉన్నాయి. కాచిగూడ భూమయ్యగల్లి నివాసి రుద్రంగి కైలాష్ 50 సంవత్సరాలుగా సిద్దిఅంబర్బజార్లోని పతంగీ బిల్డింగ్లో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర జ్యూయెలర్స్ పేర నగల దుకాణం నడుపుతున్నాడు.అతని వద్ద వేణుగోపాల్, వీరయ్య, మల్లేష్, రాజు, నర్సింలు, అంబిక, స్వప్న, అనిత పనిచేస్తున్నారు.
మంగళవారం రాత్రి వ్యాపార లావాదేవీలు ముగిసిన తర్వాత కైలాష్ ఏడు కిలోల బంగారు ఆభరణాలు, 35 కిలోల వెండి నగలు, సామాగ్రిని అల్యూమినియం పెట్టెల్లో పెట్టి లాకర్లో భద్రపరిచి తాళం వేశాడు. తాళం చెవులను షాపులోని టేబుల్ డ్రాలో వేసి దానికి తాళం వేశాడు. అనంతరం దుకాణం మూసి ఇంటికెళ్లిపోయాడు. ఎప్పటిలానే బుధవారం మధ్యాహ్నం 12.45 గంటలకు దుకాణం తెరవటానికి వచ్చాడు. అప్పటికే షాపులో పనిచేస్తున్న ఉద్యోగులు అక్కడ ఉన్నారు. దుకాణం తెరిచి లోపలికి వెళ్లి చూడగా సామాన్లు చిందరవందరగా నేలపై పడి ఉన్నాయి. దాంతో ఆందోళన చెందిన కైలాష్ పరుగున లాకర్ ఉన్న గదిలోకి వెళ్లాడు. ఆ గది గ్రిల్ తాళం కూడా పగులగొట్టి కనిపించింది. లాకర్లో దాచిపెట్టిన బంగారు, వెండి నగలు కనిపించలేదు. దాంతో అవి చోరీ అయినట్టు గ్రహించిన కైలాష్ వెంటనే బేగంబజార్ పోలీసులకు సమాచారమందించాడు.