వరుణ్ వివాదం: ఇసిపై బిజెపి గుర్రు
న్యూఢిల్లీ: వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశించడంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీవ్రంగా ప్రతిస్పందించింది. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి, ఎవరు చేయకూడదు అనే విషయాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్ కు లేదని బిజెపి నాయకుడు ప్రకాష్ జవేద్ కర్ వ్యాఖ్యానించారు. ఎవరి అభ్యర్థిత్వంపైన అయినా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆ అధికారం కోర్టులకే ఉంటుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించింది మాత్రమేనని, సిడిలోని మాటలపై వరుణ్ గాంధీ సందేహాలు వ్యక్తం చేశారని, దాన్ని పరిశీలించకుండా ఇసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. ఇసి నుంచి లేఖ అందిన తర్వాత తాము ప్రతిస్పందిస్తామని ఆయన చెప్పారు.
ఇసి నిర్ణయంపై బిజెపి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఇసి నిర్ణయానికి చట్టబద్దత లేదనేది బిజెపి అభిప్రాయంగా కనిపిస్తోంది. వరుణ్ గాంధీ వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని బిజెపి ఇప్పటికే ఇసికి తెలియజేసింది. వరుణ్ గాంధీ వ్యాఖ్యలు బిజెపి వైఖరి కాదని స్పష్టం చేసింది. సోమవారం సాయంత్రం జరిగే సమావేశంలో ఇసి వరుణ్ గాంధీ అంశాన్ని చర్చించే అవకాశం ఉంది. ఇసి అధికారికంగా ముందుకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రతిస్పందించాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు.