సోనియాతో వైయస్ భేటీ
ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గత రెండు రోజులుగా సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి వాయలార్ రవి, సీనియర్ నేత మోతీలాల్ వోరాలతో సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు. ముఖ్యమంత్రితో భేటీకి ముందే సోనియా అహ్మద్ పటేల్ నుంచి నివేదిక తెప్పించుకున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు వస్తాయని వైయస్ సోనియాతో చెప్పినట్లు సమాచారం. తాను 230 శాసనసభా స్థానాలు వస్తాయని చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల సీట్లు తగ్గే అవకాశం ఉందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. వేరే పార్టీలతో పొత్తు అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలవుతుందని ఆయన వివరించినట్లు సమాచారం. అత్యధిక లోకసభ స్థానాలను కూడా రాష్ట్రం నుంచి గెలుచుకుంటామని రాజశేఖర రెడ్డి సోనియాతో చెప్పినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డితో సమావేశం అనంతరం ఆమె డి.శ్రీనివాస్ తో సమావేశమయ్యారు.