రాజకీయ హత్య కాదు: ఎస్పీ
అనంతపురం: తెలుగుదేశం పార్టీ నాయకుడు అమరా కేశవయ్యది రాజకీయ హత్య కాదని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ చెప్పారు. తెలిసినవారే అమరా కేశవయ్యను హత్య చేశారని ఆయన శనివారం అన్నారు. సర్పంచ్ ధనకొండ కుమారుడు హత్య చేసి ఉంటాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు.
కాగా, ఓబుళనాయినిపల్లి సర్పంచే తన భర్తను చంపించడానికి అమరా కేశవయ్య భార్య శశికళ ఆరోపిస్తోంది. ఓబుళనాయినిపల్లికి చెందిన రామానాయుడు, గంగాధర అనే వ్యక్తులు అమరా కేశవయ్యను హత్య చేశారని, వారిని పట్టుకుంటామని స్థానిక పోలీసు అధికారులు అంటున్నారు.
అమరా కేశవయ్య హత్యను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హత్య జరిగిన అనంతపురం జిల్లా ధర్మవరంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు అంటున్నారు.