చంద్రబాబు మాతోనే: కారత్
ఈ నెల 18వ తేదీ సమావేశానికి వామపక్షాలు, బీఎస్పీ, తెలుగుదేశం, ఏఐఏడీఎంకే, బిజూదళ్, జేడీఎస్ హాజరవుతున్నాయని తెలిపారు. ఫలితాల అనంతర రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి 17న వామపక్షాలు సమావేశమవుతున్నట్లు తెలిపారు. 18న తమపార్టీ పొలిట్బ్యూరో, 19న కేంద్ర కమిటీ సమావేశాలుంటాయన్నారు. దేవెగౌడ తనయుడు కుమారస్వామి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసిన నేపథ్యంలో ఆ పార్టీకూడా 18న జరిగే సమావేశానికి వస్తుందా అని ప్రశ్నిస్తే ఎందుకు రాదని కారత్ ఎదురుప్రశ్న వేశారు. దేవెగౌడ తన పార్టీ విధానం గురించి స్పష్టంగా చెప్పారని, అంతకంటే ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు. తెరాస రాకపోవచ్చని, వాళ్లు వేరే చోటు చూసుకున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2004లో మాదిరి వామపక్షాలు కాంగ్రెస్ కు మద్దతు పలుకుతాయా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని, భవిష్యత్తు కార్యాచరణ అన్ని పార్టీలతో కలిసి నిర్ణయిస్తామని వెల్లడించారు.