కోస్తాలో రికార్డు స్ధాయి ఎండలు
విశాఖపట్నం: గడచిన మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన ఎండ తీవ్రత బుధవారం రికార్డు స్థాయిని తాకింది. కోస్తా పొడవునా పొడిగాలులు వీయడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఆరేడు డిగ్రీలు ఎక్కువగా బుధవారం నమోదయ్యాయి. 30 డిగ్రీలకు కొంచెం ఎక్కువగా వుండే కళింగపట్నంలో 40.4 డిగ్రీలు నమోదయ్యింది. గురువారం కూడా సూర్యుడు ప్రతాపం చూపాడు.
విశాఖ విమానాశ్రయంలో 42.4, బాపట్లలో 42.4, వాల్తే ర్ లో 40.4, నర్సాపూర్ లో 40.2, నిజామాబాద్ లో 40.2, మచిలీపట్నంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. పశ్చిమ దిశ నుంచి వచ్చే గాలులు సముద్రం నుంచి భూమి మీదకు వీచే గాలులను అడ్డుకుంటున్నందున ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితులు మరో రెండు, మూడు రోజులు ఉంటాయని వాతావరణ శాస్త్రజ్ఞుడు ఆర్.మురళీకృష్ణ తెలిపారు.
ఈ నెల ఎనిమిదిన మృగశిర కార్తె ప్రవేశించేంత వరకూ వాతావరణంలో పెద్దగా మార్పులేవీ వుండవని ఆయన తెలిపారు. రుతుపవనాల ప్రవేశం తరువాత సెకండ్ స్పెల్ వరకు ఇటువంటి ఇబ్బందులు వుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. విశాఖలో 1995 జూన్ ఎనిమిదిన 45.4 డిగ్రీలు నమోదైన విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
గత నెల 20న అండమాన్, 23న కేరళను తాకిన రుతుపవనాలు మొదట్లో వేగంగానే పురోగమించినప్పటికీ ప్రస్తుతం ఒక్కసారిగా జోరు తగ్గింది. గత నెలలో ఏర్పడిన ఐలా తుపానుతో బలపడిన రుతుపవనాలు ముందుకు కదిలినా ఈశాన్య ర్రాష్టాల వైపు పయనించడంతో దక్షిణ భారతంలో దాని ప్రభావం తగ్గింది. అయితే ఈనెల ఆరున ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది వాయవ్య దిశగా పయనిస్తే తప్ప నైరుతి రుతుపవనాల రెండవ స్పెల్లో పెద్దగా కదలిక వుండదని మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. సాధారణంగా రుతుపవనాలు జూన్ ఐదున ఒంగోలును, ఎనిమిదిన విశాఖపట్టణాన్ని తాకుతాయి. ఈ ఏడాది పది రోజుల ముందుగానే రాయలసీమ, ఒంగోలును తాకినప్పటికీ బంగాళాఖాతంలో అల్పపీడనం లేనందున ముందుకు కదలలేదు.