విజయశాంతి కనబడుట లేదు
ఇదిలా ఉంటే విజయశాంతి హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో తమ పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావును వెనకేసుకొచ్చారు. గెలిస్తే తమ సొంత కృషి అని ఓడిపోతే పార్టీ అధ్యక్షుడి వల్లేనంటూ నాయకత్వాన్ని విమర్శించడం మంచిదికాదని మెదక్ ఎంపీ, తెరాస రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ విజయశాంతి పార్టీ అసంతృప్త నేతలకు హితవు చెప్పారు. కేసీఆర్పై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తెచ్చింది ఆయనేనన్న విషయాన్ని మరువరాదన్నారు. గతకొన్ని రోజులుగా తనను, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ వాదాన్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అందుబాటులో లేనంటూ కొందరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారనడంలో వాస్తవంలేదన్నారు. పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి గతవారంలో 3, 4రోజులపాటు సభకు వెళ్లానని స్పష్టం చేశారు. గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి సోమవారం అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో తెలంగాణ ఇస్తారో లేదో తేల్చిచెప్పకుండా నాన్చుడు వైఖరి అవలంభించడం ఎంతవరకు సమంజసమన్నారు.