వరవరావుపై పటేల్ భార్య గుస్సా
హైదరాబాద్: పోలీసుల ఎన్ కౌంటర్ లో మృతిచెందిన భర్త అంత్యక్రియల్లో పాల్గొన్న ఉద్యమ కళాకారులు వరవరరావు, విమలక్కలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ హేళన చేశారని పటేల్ సుధాకర్ రెడ్డి భార్య నర్సక్క అలియాస్ వనజ ఆవేదన వ్యక్తం చేశారు. తాను 25 ఏళ్లు ఉద్యమంలో ఉండి పోరాటం చేసి రెండు జిల్లాల్లో దళ కమాండర్ గా పనిచేశానని, 1986లో సుధాకర్ తో వివాహం జరిగిందని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆనారోగ్యం కారణంగా ఉద్యమం నుంచి అప్పటి హోంమంత్రి స్వర్గీయ మాధవరెడ్డి ఎదుట లొంగిపోయానని చెప్పారు.
అప్పుడెప్పుడో సుధాకర్ రెడ్డి చేసిన పత్రికా ప్రకటనపై ఇప్పుడు విమర్శలు చేశారని, అది సరి కాదని ఆమె అన్నారు. ఉద్యమంలో పనిచేసిన తనను ఇలా దూషించడం సరైందేనా అని ఆమె ప్రశ్నించారు. జల్సా జీవితాలకు అలవాటు పడ్డ వరవరరావు ఉద్యమంలో ఉన్న మాజీల గురించి ఇలా మాట్లాడడం విడ్డూరమేమీ కాదని ఆమె అన్నారు. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే వరవరరావు, విమలక్కలకు ఉద్యమంలో పోరాడే వ్యక్తుల గురించి ఏం తెలుసని ఆమె ప్రశ్నించారు. పటేల్ సుధాకర్ రెడ్డిని ఆస్తుల కోసం పెళ్లి చేసుకోలేదని, తనకు ఆస్తిపాస్తులు లేకున్నా నా కొడుకును కష్టపడి చదివించుకున్నానని ఆమె చెప్పారు.