మందుపాతరకు 9 మంది జవాన్లు బలి
కోరాపుట్: ఒరిస్సాలోని కొరాపుట్ జిల్లాలో గురువారం మావోయిస్టులు మందుపాతర పేల్చి తొమ్మిది మంది జవాన్లను హతమార్చారు. గురువారం ఉదయం నారాయణపట్నం సమితి పాలూరు గ్రామం వద్ద ఘాట్ రోడ్డు మలుపులో కల్వర్టు కింద శక్తిమంతమైన మందుపాతరను పేల్చడంతో ఒరిస్సా స్టేట్ స్పెషల్ ఫోర్స్కు (ఓఎస్ ఎస్ ఎఫ్)కు చెందిన ఎనిమిది మంది జవాన్లు, ఒక డ్రైవరు బలయ్యారు. మావోయిస్టులు పథకం ప్రకారమే జవాన్లను రప్పించి హతమార్చారు. నారాయణ పట్నం బ్లాకుకు వెళ్లే అన్ని రహదారులకు అడ్డంగా చెట్లు నరికి పడేశారు. దీంతో ఆ ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాటిని తొలగించడానికి పోలీసులు వస్తారని ఊహించే ఎక్కడికక్కడ మందుపాతరలు అమర్చారు. వారనుకున్నట్లుగానే చెట్లను తొలగించి దారిని సరిచేయడానికి గురువారం ఉదయం పోలీసులు రెండు బృందాలుగా బయలుదేరారు. ఒక బృందం నారాయణపట్నం మీదుగా, మరొకటి లక్ష్మీపురం నుంచి వెళ్లింది. ఓఎస్ ఎస్ ఎఫ్ దళం కొత్తగా ఏర్పాటైంది. ఇందులో ఎక్కువమంది మాజీ సైనికులే.
ఉదయం 9 గంటలకు కమాండర్ జీపులో ప్రత్యేక బలగాల రాకను గమనించిన మావోయిస్టులు కల్వర్టు మీదకు రాగానే మందుపాతర పేల్చారు. పేలుడు ధాటికి జీపు 60 అడుగుల ఎత్తుకు ఎగిరి పడినట్లు సంఘటన స్థలంలోని పరిస్థితిని చూసి అంచనా వేస్తున్నారు. రహదారిపై 10 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. జీపు పైకప్పునకు ఉన్న టార్పాలిన్ 60 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టుకు వేలాడుతోంది. కొండ పైభాగాన వాహనానికి సంబంధించి ఒక భాగం పడి ఉంది.
జవాన్ల మృతదేహాలు, శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక జవాను కాళ్లు పూర్తిగా తెగి 20 అడుగుల దూరంలో పడి కాలిపోయాయి. మరో జవాను కాళ్లు తెగి మొండెం దూరంగా పడింది. కల్వర్టుకు 30 అడుగుల కింద లోయలోని పొదల్లో మూడు మృతదేహాలు పడి ఉన్నాయి. మరి కొందరి ఆచూకీ తెలియడం లేదు. జవాన్ల వద్ద ఉన్న ఏకే-47, ఎస్ఎల్ఆర్ తుపాకీలు కనిపించడం లేదు. వీటిని నక్సల్స్ ఎత్తుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా మందుపాతర పేల్చినట్లు మావోయిస్టులు బ్యానర్లు కట్టారు. ఆదివాసీలకు అటవీ హక్కులు కల్పించాలని రాశారు. గురువారం రాత్రి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు.