ఎమ్మెల్యేపై నివేదిక తెప్పిస్తా: బూటా
పార్లమెంటరీ పార్టీ నేత నామానాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపీలు మైసూరారెడ్డి, హరికృష్ణ, రమేష్ రాథోడ్, నిమ్మలకిష్టప్ప, ఎం.వేణుగోపాల్ రెడ్డి, ఎన్.శివప్రసాద్, కొనకళ్ల నారాయణ, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వర్లరామారావు..ఎమ్మెల్యేలు బల్లి దుర్గాప్రసాద్, కె.ఎస్.రత్నం, హనుమంతు షిండే, మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు, ఎమ్మెల్సీ వై.బాబూరాజేంద్రసాద్ లు బూటాను కలిసి వినతిపత్రం సమర్పించారు.
రామారావుని చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకుడు పిల్లి డేవిడ్కుమార్, సాక్షి టీవీ విలేకరి శ్యామలరావు కలిసి కుట్ర పన్నారని వివరించారు. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబసభ్యులు నడుపుతున్న 'సాక్షి' పత్రిక ప్రధాన భూమిక పోషించిందని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు దర్యాప్తు జరిపి ఎమ్మెల్యేకు చెందిన నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో ఎలాంటి నేరం జరగలేదని తేల్చారని ఆయన దృష్టికి తెచ్చారు. అక్కడున్నవి రెడ్ ఆక్సైడ్ గుర్తులే తప్ప రక్తపు మరకలు కావని ఫోరెన్సిక్ నిపుణులు సైతం తేల్చారని వివరించారు. అయితే అధికారుల బహిరంగ ప్రకటనలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని చెప్పారు.
తెదేపా సభ్యుల విజ్ఞప్తిని సావధానంగా విన్న బూటాసింగ్ తర్వాత విలేఖర్లతో మాట్లాడారు. దీనికి సంబంధించిన నిజానిజాలను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, వివిధ అధికార యంత్రాంగాల నుంచి తెప్పించుకొని పరిశీలిస్తామని చెప్పారు.