అఫ్గాన్ లో 6గురు ఇండియన్స్ హత్య
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ లోని ఒక నిర్మాణ సంస్థపై తాలిబాన్లు దాడి చేశారు. ఈ దాడిలో 18 మరణించినట్లు, వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు పాకిస్తాన్ టీవీ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. తామే ఈ దాడికి పాల్పడ్డట్లు తాలిబాన్ ప్రకటించుకుంది. మృతుల్లో భారతీయులు, అఫ్గాన్లు, ఆఫ్రికన్లు ఉన్నట్లు తాలిబాన్ ప్రతినిధి తమకు ఫోన్ చేసి చెప్పాడని పాకిస్తాన్ టీవీ తెలిపింది. ఆ ప్రతినిధి తన పేరు చెప్పడానికి నిరాకరించాడు.
అయితే ఈ సంఘటనను అధికార వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. చానెల్ దాడికి సంబంధించి వీడియోను ప్రసారం చేసింది. దాన్ని తాలిబాన్లు అందించినట్లు చెప్పింది. ఎకె 47 రైఫిళ్లతో, రాకెట్ లాంచర్లతో వారు దాడి చేసినట్లు ఫుటేజ్ చూస్తే తెలుస్తోంది. తాలిబాన్లు దాడి చేసింది భారత్ కు చెందిన కంపెనీ అని, అమెరికా కంపెనీకి అనుబంధంగా అది పనిచేస్తోందని తెలుస్తోంది. ఇస్లామ్ వ్యతిరేక కార్యకలాపాల వల్లనే తాము దాడి చేసినట్లు తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు.